14, నవంబర్ 2017, మంగళవారం

ఉపయుక్తమైన కరదీపిక...'.మీరే జర్నలిస్ట్'


---- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
మీడియా విశ్లేషకులు, సైన్స్‌ రచయిత
ఆకాశవాణి - తిరుపతి
-----------------------

తప్పెట కొట్టి చాటింపు వేయడం నుంచి ఆండ్రాయిడ్‌ తట్టి మాట్లాడడం దాకా సాగిన మన కమ్యూఁకేషన్స్‌ ప్రస్థానాన్ని గమనిస్తే బోధపడేది ఏమిటి?
అచ్చుయంత్రం, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, కంప్యూటర్‌, మొబైల్‌ సెల్‌ఫోన్‌ వంటి సమాచార సాధనాలు రావడంతో భావప్రసార విధానం, విఁయోగం విపరీతంగా పెరిగాయి. ఈ టెక్నాలజీ ఆధారంగానే కమ్యూనికేషన్‌ రూపం, స్వభావం, విస్తృతి మారుతూ వచ్చాయి.
తొలిదశలో భాష వృద్ధి చెందడంతో భావ వ్యక్తీకరణ విధానాలు మారాయి. దాంతో సమాచార ప్రసార మార్గాలు రూపొందుతూ వచ్చాయి. మలిదశలో దూరాన్ని జయిస్తూ, ఏక కాలంలో ఎక్కువ మందిని చేరగలిగే టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. అందులో కూడా మార్పులు ఎంత తీవ్రంగా, శీఘ్రంగా ఉన్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. టెలివిజన్‌ చానళ్ల వేగం ఏమిటో, దీనితో పోలిస్తే మొబైల్‌ దూకుడు ఏమిటో ఒకసారి పోల్చుకోండి!
ఈ మీడియా ప్రయాణంలో పదనిసలు చాలా ఉన్నాయి. ఇది వంద సంవత్సరాల క్రితపు తూర్పు దేశాల ముచ్చట. పత్రికల రాజ్యంలోకి రేడియో ప్రవేశించడం ఒక నిశ్శబ్ద విప్లవం. అచ్చుకావడం, పాఠకులను చేరడం అనే ప్రక్రియల్లో అంతర్భాగమైన ఆలస్యం, దూరం, నిరక్షరాస్యత అనే మూడు పరిమితులను రేడియో ఒక్కసారిగా దాటేసింది. ఫలితంగా పత్రికా యాజమాన్యాలకు కంటగింపు మొదలై, కట్టడి ఆరంభమైంది. అప్పటికి దినపత్రికలంటే సాయంకాల దిన పత్రికలే! పత్రికలు వెలువడి, పాఠకులకు చేరి, వారు చదివిన తర్వాతే` అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాతే రేడియో వార్తలు ఇచ్చేది. పత్రిక, రేడియో మాధ్యమాల మధ్య ఈ పెనుగులాట రెండవ ప్రపంచ యుద్ధందాకా కొనసాగింది. ఇది ఒక్క బ్రిటన్‌ అనుభవం మాత్రమే కాదు. చాలా దేశాల చరిత్ర. ప్రస్తుతం ఈ సంగతి తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయాల్లో పెద్దలదన్ను, దాదాగిరి ఎంత సహజమో? మీడియా సామ్రాజ్యవాదం కూడా అంతే సహజం!
పాతికేళ్ల క్రితం మన దేశపు జర్నలిజంలోకి ప్రయివేట్‌ టెలివిజన్‌ వినోద రంగం నుంచి ప్రవేశించింది. న్యూస్‌ టెలివిజన్‌ రాకతో పత్రికా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులు ఉలిక్కిపడి విమర్శలు గుప్పించారు. అటువంటి వాదాలు నేటికీ అడపాదడపా వినబడుతుంటాయి. టెలివిజన్‌ మాధ్యమం మేధావుల మాధ్యమం కాదని వీరి వాదం. అయితే అటు యాజమాన్యాలు ఇటు సంపాదకవర్గాలు న్యూస్‌ చానళ్లలోకి ప్రవేశించడమే కాదు. కీలక స్థానాలను కూడా అక్రమించారు.
ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి. టెలివిజన్‌ వచ్చేదాకా మీడియా అంటే పత్రికారంగమే! కానీ పిమ్మట దృశ్యం మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్‌ మీడియా అనే విభజన మొదలైంది. నేడు మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అని పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కంప్యూటర్‌ రావడంతో ఎలక్ట్రానిక్ రూపంలో అచ్చు పత్రికను పోలిన ఇమేజెస్‌ను ఇ`పేపర్లుగా చదువుకఁనే వెసులుబాటు కలిగింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియానా? ప్రింట్‌ మీడియానా? రెండింటికీ అవునూ అనీ, కాదూ అనీ జవాబు చెప్పొచ్చు. అందుకే దీనిని ‘న్యూ మీడియా’ అని పేర్కొన్నారు.
ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా న్యూస్‌ చానళ్ళు పత్రికలను తరిమితే, మధ్యాహ్నం నుంచి పత్రికలను చానళ్లు ఉరకలు పెట్టిస్తాయని భావించడం నిన్నటి వరకూ వాస్తవం. నేడు రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ ఆధిపత్యానికి అవలీలగా గండికొట్టింది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ రిమోట్‌తో వీక్షకులు చానళ్లు మార్చడమే తప్ప చూడటం లేదు అనే విమర్శ ఉంది. సుళువుగా చానల్‌ మార్చగలగడంతో ముందుకొచ్చిన సమస్య ఇది. సోషల్‌ మీడియా అలా కాకుండా అరచేతిలో, నీకేమి కావాలో నీవు చూసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌలభ్యమే సోషల్‌ మీడియా విజయపాచిక. అంతకు మించి లైసెన్సు, టెక్నాలజీ, పెట్టుబడి, సిబ్బంది లేకుండా సమాంతరగళం వినిపించే, సమాంతర దృశ్యాల్ని చూపించే వేదికను సోషల్‌ మీడియా కల్పించింది. అందువల్ల పత్రిక, టెలివిజన్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయగలిగే సదుపాయం` ఈ ప్రపంచానికి ఈ సమయంలో అవసరమైన గొప్ప ఊరట. ప్రశ్నలకు దొరకని ప్రముఖులూ , పరీక్షలు ఎదుర్కోని సంస్థలూ సోషల్‌ మీడియాను చూసి బెదిరిపోవడంలో ఆశ్చర్యం లేదు. మరో విషయం కూడా గమనించాలి - సోషల్‌ మీడియాలో చదువరి, వీక్షకుడు, జర్నలిస్టు, వార్తాంశాల యజమాని ఒకరే! టెలివిజన్‌ చానల్‌కు ఫుటేజీ, వాయిస్‌ బైట్‌ పంపితే సిటిజన్‌ జర్నలిజం. ఇలా స్వీకరించిన వార్తాంశాలను గమనించి, అవసరమైతే కత్తిరించి చానల్‌లో ప్రసారం చేయవచ్చు. కానీ సోషల్‌ మీడియా ఒకే వ్యక్తి మీడియా వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, నియంత్రించే వ్యక్తి!
మనదేశపు మీడియా గురించి రెండు విషయాలను కీలకంగా భావించాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఉజ్వలమైన చరిత్ర భారతదేశపు పత్రికా రంగానిది. స్వాతంత్య్రోద్యమంతో ముడిపడిన భారతీయ పత్రికారంగం దేశవాసులందరినీ కలపడంలోనూ, వారిని ప్రగతిశీలదారుల్లో నడిపించడంలోనూ గొప్ప పాత్రపోషించింది. టెలివిజన్‌ రంగం మాత్రం ప్రపంచీకరణతో ప్రాణం పోసుకుని విస్తరించింది. ఇక్కడ వాణిజ్యమే ఊపిరి. మిగతా అంతా ఊక, ఉబుసుపోక! అందుకే టెలివిజన్‌ తెరపై రక్తికట్టిన వాణిజ్య చమత్కారాలు నేటికీ పత్రికల్లో రసాభాస అవుతున్నాయి. డెబ్బయ్యేళ్ల క్రితపు విలువలు నేటి మీడియా రంగంలో వెతికి భంగపడుతున్న వ్యక్తులకు కొదవ లేదు. ఒకే సంస్థకకు ఒకే చోట నుంచి పత్రిక ప్రచురణను, చానల్‌ ప్రసారాన్ని అమెరికా వంటి దేశాల్లో కూడా అనుమతించరు. దీనిని క్రాస్‌ మీడియా రెగ్యులేషన్‌ అంటారు. అలాంటి నియమాలు రూపుదిద్దుకోక ముందే మన దేశపు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్పోటనం సంభవించింది. నేడు సోషల్‌ మీడియాకు సంకెళ్లు అవసరమని కొందరు వాదిస్తూ, కొన్ని కారణాలు చూపిస్తున్నారు.
నేడు ఏ మీడియా కూడా సేవ కాదు. ఫక్తు వాణిజ్యం, వ్యాప్తి, లాభార్జన ధ్యేయం. అయితే దీనిని బాహాటంగా చెప్పుకోకఁండా లాఘవంగా తప్పుకుంటారు. మీడియా అంటే వాణిజ్యమే కాదు. అధికారం, రాజకీయం కూడా! కనుకనే పార్టీలకు చానళ్లున్నాయి. ముందు ముందు మీడియా సంస్థలకు పార్టీలు వచ్చినా ఆశ్చర్యపోకూడదు!
******** ****** ********
ఇంత పరిణామశీలంగల, , ప్రభావవంతమైన మీడియాను ఎలా అధ్యయనం చేయాలి? ఒక పరిణామాన్నీ, దాని ప్రభావాలను గమనించే లోపు మరిన్ని పరిణామాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీడియాపై సమగ్ర అవగాహన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ద్వారా లభిస్తుందా? మీడియా సంస్థల శిక్షణాకాలంలో దక్కుతుందా? చాలా మౌలికమైన ప్రణాళికలో సాగే విశ్వవిద్యాలయ కోర్సు ప్రయోజనం పరిమితం. ఇక మీడియా సంస్థలో ఇచ్చే శిక్షణలు ఆ సంస్థ అవసరాలు, దృక్పథాల్ని బట్టి ఉంటాయి కానీ, సమాంతర వాదాలు కానీ, సమగ్రమైన అవగాహన కానీ సాధ్యం కావు. అందుకే నిజమైన జర్నలిస్టులు ఏకలవ్యులుగా ముందుకు సాగాలి. కనుకనే ఎక్కువ అపజయాలు, తక్కువ సంఖ్యలో అపురూప విజయాలు ఎదురవుతాయి. మరి మీడియా పాండిత్యం, నైపుణ్యం ఎలా సాధ్యపడతాయి? మీడియాని పరిశీలించడమే ఏకైక అధ్యయన మార్గం! వందల సంఖ్యలో పత్రికలు, చానళ్లు ఉన్నప్పుడు, వీటికి మించి సోషల్‌ మీడియా విజృంభిస్తున్నప్పుడు మీడియా పరిశీన ఎలా సాధ్యం? ఇది సాధ్యపడే విషయం కాదు పూర్తిగా! కానీ ఇదే ఏకైక మార్గం. దీనికి కొంత ఊతంగా తోడ్పడేవి మీడియా గురించి వెలువడిన పుస్తకాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి పుస్తకాలు అపురూపం కానీ, ఇటీవల ఏన్నో రకాల మీడియా గ్రంథాలు వెలువడ్డాయి, ఇంగ్లీషుతో పోలిస్తే తెలుగులో మీడియా గ్రంథాలు తక్కువే కావొచ్చు. కానీ వైవిధ్యం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మీడియాపై తగిన అవగాహన కలిగించే పుస్తకం ` బెందాళం క్రిష్ణారావు గారి ‘మీరే జర్నలిస్ట్‌’ అనే ఈ పుస్తకం. గతంలో ‘వార్తలు ఎలా రాయాలి?’ అనే వీరి పుస్తకం 2006లో వచ్చింది. అంతవరకు వారు నాకు తెలియదు. హైదరాబాదు, విజయవాడ వంటి నగరాల నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి ఈ పుస్తకం వెలువడడం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. తర్వాత రచయిత వివరాలు తెలియడం, స్వయంగా కలవడం... అలా మా అనుబంధం మొదలైంది. వారికి సమాజం పట్ల ఆసక్తి, వృత్తి పట్ల బాధ్యత ఉన్నాయి. బౌద్ధం పట్ల , మార్క్సిజం, అంబేద్కరిజం పట్ల అభిమానం, గౌరవం, సాహిత్యం పట్ల అభిలాష ఉన్నాయి. సుమారు మూడొందల డెబ్బయి పేజీల ఈ గ్రంథంలో తొంబయి రెండు అంశాలున్నాయి. నిజానికి ఒక్కో అంశం మీద ఒకో పుస్తకం రాయడానికి ఆస్కారం ఉంది. కనుక మితి లేదు. అయితే చాలా వరకూ అవగాహన కలిగించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. అదే సమయంలో ఇందులో జత చేయడానికి ఎన్నో అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొంతకాలం సంపాదకీయాలు ప్రచురించకఁండా, మరికొంత కాలం ఎక్కడబడితే అక్కడ సంపాదకీయాలు ప్రచురించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక కొన్ని సంవత్సరాలుగా కీలకమైన వార్త ఇచ్చే చోట ‘టైమ్స్‌ వ్యూ’ అని క్లుప్తంగా ఇస్తోంది. సంపాదకీయం అంటూ విడిగా ప్రచురించని ‘మింట్‌’ పత్రిక తొలిపుటలో ‘క్విక్‌ ఎడిట్‌’ అని పది పన్నెండు వాక్యాల వ్యాఖ్య రాస్తుంది. అంతా కుదించుకుని, కుచించుకుని పోతున్న సమయంలో ‘న్యారేటివ్‌ జర్నలిజం’ మళ్లీ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్యారవాన్‌’ మాసపత్రిక, ‘మింట్‌’ దినపత్రిక ఈ తరహా జర్నలిజానికి ఉదాహరణలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి 1960లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఆరంభమైనప్పుడు ‘పెత్తందార్‌’ అనే కార్టూన్‌ స్ట్రిప్‌ ప్రతిరోజూ వేసేవారు. తెలుగులో వారిదే తొలి స్ట్రిప్‌ కార్టూన్‌. ఇలా ఎన్నో విషయాలుండొచ్చు. ఈ పుస్తకంలో బెందాళం క్రిష్ణారావు గుదిగుచ్చిన అంశాల జాబితా కూడా ఇలానే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రకంగా కూడా ఇది ఒక బుల్లి జర్నలిజపు సర్వస్వం! కనుకనే వారికి నా అభినందనలు.
( మీరే జర్నలిస్ట్....పుస్తకానికి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రాసిన విలువైన ముందుమాట )
***********************