22, ఏప్రిల్ 2013, సోమవారం

నీలంరాజు

నీలంరాజుగారి సంపాదకత్వం
nagasuri-book-photo‘కథ నడిపిన తీరు బాగానే ఉంది- ఇతివృత్తం నాకు సమ్మతం కాదు’
‘ఇతివృత్తంతో మాకేమి పని? రచన బాగుంది కదా? వేయండి!’
‘అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలు పడదు’
‘క్రమ, అక్రమ సంబంధాల గురించి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసి ఉం టే వేయడమే’
‘ఎడిటర్‌ పోస్ట్‌ మా న్‌ కాదు. పాఠకుల ఎడల అతనికో బాధ్యత ఉంది’
‘ఎడిటర్‌ కర్తవ్యమంతే అయి ఉండాలి’
ఈ ఎడిటర్‌ అట్లా అనుకోవడం లేదు’
- ఇలా రచనను తిరస్కరించింది ‘నవోదయ’ వార ప్రతిక సంపాదకుడు నీలంరాజు వేంకట శేషయ్య. తన మిత్రుడి రచనను ప్రచురింపచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మరో విఖ్యాత పాత్రికేయు డు, సంపాదకుడు గోరా శాస్ర్తి అని తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు. అప్పటి గోరా శాస్ర్తి అదే నవోదయంలో ‘చేగోడీలు తింటూ’ అనే కాలమ్‌ అప్పుడే రాస్తుండడం గమనార్హం. ఇక్కడ నీలంరాజుగారి భావజాలం, గోరా శాస్ర్తిగారి లిబరలిజం బయటపడతాయి.

ఇరవై ఏళ్ళు ఆంధ్ర పత్రికలో, మరో ఇరవయ్యేళ్ళు ఆంధ్ర ప్రభలో పనిచేసిన నీలంరాజు వేంకట శేషయ్యగారి గురించి వారి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఇటీవల ‘కంచి పరమాచార్యుల ప్రియ శిష్యుడు, పత్రికారంగ నిర్దేశకుడు నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని అన్ని సంగతుల గురించి రాసే జర్నలిస్టుల జీవిత విశేషాలు తక్కువగా వెల్లడి అవుతుంటాయి. సంగీతం, నాటక రంగం, సినిమా, ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యేక ఆసక్తి గల నీలంరాజు బాగా రాణించిన పాత్రికేయుడు. 1905 డిసెంబర్‌ 22న జన్మించిన నీలంరాజు ప్రకాశం పంతులు సహాయకుడుగా మొదలై, చివరకు ఒక పెద్ద పత్రిక ఎడిటర్‌గా రూపొందారు. స్వరాజ్య, ఆంధ్రపత్రిక, నాట్యకళ, నవోదయ, ఆంధ్రప్రభ- ఇదీ వారి పత్రికా ప్రస్థానం. 1938లో ఉషాపరిణయం సినిమాలో అనిరుద్ధ పాత్ర వేసిన అందమైన కథానాయకుడు కూడా ఆయనే. భద్రాచలం దేవాలయం జీర్నోద్ధరణకు పత్రికను వినియోగించి ఫలితం సాధించినవారు ఆయన. పరమాచార్య గురించి ‘నడిచే దేవుడు’ అనే పుస్తకరం ప్రచురించిన భక్తుడు కూడా ఆయనే!
‘నాకు అప్పుడు కనిపించింది విషాద యోగంలో మునిగిన విజయుడు కాదు; హాలాహలం మింగిన హరుడు. ఏమా ఠీవి! ఏమా దర్పం! ఎంత రాజసం! ఎవరిలో చూడగలం ఆక్షాత్ర తేజం! మూర్తీభవించిన వీర రసమా? కదలి వచ్చి హిమవన్నగమా?’

- మహాత్మా గాంధీతో విభేదాలు వచ్చినప్పుడు ప్రకాశం పంతులు సంకట స్థితి గురించి వివరించే సందర్భంలో నీలంరాజు కలం చెక్కిన అక్షర శిల్పం ఇది. ఈ పుస్తకంలో అనుబంధంగా ప్రకాశంగారి వాత్సల్యం గురించి, భద్రాచలం రామదాసు ధ్యాన మందిరం గురించి రెండు వ్యాసాలను ఇచ్చారు. ఈ రెండు వ్యాసాల్లో వస్తువు విషయం ఒక వైపు ఉండగా; నీలంరాజుగారి రచనా శైలి చక్కగా పరిచయం చేయడమనేది మరోవైపు స్పష్టంగా కనబడుతుంది.

- పుస్తకం అట్ట మీద పుస్తకం పేరు ఒక విధంగా ఉండగా, లోపలి అట్ట మీద, ప్రతి పుటలోనూ పుస్తకం పేరు ‘మా తండ్రి శేషయ్య గారు’. నిజానికి ఇక్కడేదో సమన్వయ లోపంతో ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ ‘మా తండ్రి శేషయ్య గారు’ అన్నదే సరైన మకుటమని పిస్తుంది. వారి మొదటి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఫస్ట్‌ పర్సన్‌లో చెప్పిన విషయాలకు ఇదే సరైన శీర్షిక కూడా. శేషయ్యగారి జీవిత చరిత్ర ఏదీ లేని సమయంలో ఈ పుస్తకం ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది. జాతీయోద్యమం, విద్యార్ధి దశ, మద్రాసు జీవనం, స్వరాజ్య, ఆంధ్ర పాత్రిేయం, కళాభినివేశం, విదేశీ యాత్రలు- చేసినవీ, విరమించినవీ, నవోదయ, ఆంధ్ర ప్రభ, రామ కార్యాలు, ఆఖరిమలుపులు- ఇవీ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు.

- కొన్ని పుస్తకాలు చేతికి రాగానే ఆ రాత్రో, మరుసటి రోజో చదివేసే సందర్భం ఉంటుంది. అది వేళా విశేషం కాదు. కానీ ఆ పుస్తకం దేని గురించి, ఎవరు రాసింది, మనకు ఉన్న సమయం వంటి అంశాలపై చదవడమనేది ఆధారపడి ఉంటుంది. నన్ను అలా చదివించిన ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మద్రాసునుండి బ్రిటిష్‌వారి అనుకూల పత్రిక మద్రాసు మెయిల్‌, మితవాద పత్రిక ది హిందూతో పాటు గర్జించే ‘స్వరాజ్య’ ఆంగ్లంలో ఉండగా, ఆంధ్రపత్రిక తెలుగులో ఉండేది. ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరేడు గంటల మధ్య కాలంలో విడుదలయ్యేవి.

చాలా కాలం పాటు రిపోర్టర్‌గా ఉన్న కాలంలో కూడా ఆంధ్రపత్రికలో సినిమా పేజీని నీలంరాజు నిర్వహించేవారు.

మొదట హిందూ, ఆంధ్రపత్రిక రెండూ తొలి పేజీలో ప్రకటనలు ఇచ్చేవి. హిందూ తొలి పేజీలో వార్తలు వేసినప్పుడు ఆంధ్రపత్రిక కూడా మార్చింది.

ఆంధ్రపత్రికలో సంపాదకత్వం ముగిసిన తర్వాత 1970- 71లో నీలంరాజు భద్రాచలం ఎటపాక గ్రామంలో వ్యవసాయం చేశారు. దీన్ని నార్ల వెంకటేశ్వరరావు బ్రాహ్మణ వ్యవసాయం అన్నారు.
పత్రికల పేర్లలో వత్తులుండకూడదు. రైల్వే స్టేషన్‌లో పేపర్‌ బాయ్‌ కూడా పలకడానికి సులువుగా పేరుండాలని నీలంరాజు ‘నవోదయ’ అనే పేరును వారపత్రికకు స్వీకరించారు. శ్రీశ్రీ ఎంతటి ఇమేజరీ ప్రవేశపెట్టి రాత రాసేవారో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవారు.
‘నవోదయ’తో చితికి పోయిన నీలంరాజును 1949- 50 లలో నార్ల అడిగి ప్రభలో చేర్పించుకున్నారు. నీలంరాజు ఎడిటోరియల్‌ రైటర్‌గా చేరి, 1959లో ఎడిటర్‌ అయ్యారు.

‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ గొప్ప ఎడిటర్‌ ఎస్‌. సదానంద్‌ వీరుడిలా బతికి బొంబాయిలో చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు. ఇది తెలిసి రామనాథ్‌ గోయంకా ప్రత్యేకంగా విమానంలో సదానంద్‌ దేహాన్ని మద్రాసు తెప్పించి, అంత్యక్రియలు జరిపించారు.
- నీలంరాజు గారి మరిన్ని వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తకాలు చదవాలని ఆసక్తి కలిగించే రీతిలో ఈ పుస్తకం రచించిన లక్ష్మీ ప్రసాద్‌కు అభినందనలు. 

(నాగసూరి వేణుగోపాల్.....వ్యాసం)
|

ఇందు

ఇందు `జై`న్
పత్రికను నడిపించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అందునా ఆంగ్ల పత్రిక అంటే ఎంతో శ్రమ, ఆర్థికంతో కూడుకున్న పని. అలాంటిది ఒకటి కాదు దాదాపు పత్రికలు, మ్యాగజైన్‌లు కలిపి 15 వరకు ప్రచురితం చేస్తున్నారు. ఐదు భాషల్లో వివిధ రకాలుగా వీటిని అందిస్తున్నారు. ఇవన్నీ కూడా టైమ్స్ గ్రూప్‌ కింద నడుస్తున్నాయి. వందల కోట్లతో ఇంత పెద్ద మొత్తంలో సడుస్తున్న సంస్థ చైర్మన్‌ మహిళ అంటే ఆశ్చర్యపోక తప్పదు. మీడియా రంగాన్ని తలలు పండిన హేమాహేమీలే నిర్వహించలేక సతమతమవుతుంటారు. అలాంటిది ఓ మహిళ ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా పత్రికను నడిపించడం ఆమె కృషికి, కార్యదక్షతకు నిదర్శనం అని చెప్పవచ్చు. 77 ఏళ్ల ఆ మహిళే ఇందూ జైన్‌.


- టైమ్స్ గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు
- గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి
- కొత్త పత్రికలు, మ్యాగజైన్ల ఆవిష్కరణ
- 5 భాషల్లో పలు దిన పత్రికలు
- సాయం అందించడంలోనూ ముందే
- మానవతావాదిగా గుర్తింపు
- ఆధ్యాత్మికవేత్త, రచయిత్రి కూడా


దేశంలో అత్యంత పెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి(టైమ్స్ గ్రూప్) సారథిగా వ్యవహరిస్తున్నారు. ఇందు జైన్ షాహు కుటుంబానికి చెందింది. బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీ సారథిగా వ్యవహరించడమే కాకుండా అమె విద్యావేత్త, మానవాతవాది, కళ పోషణ కలిగిన అధ్యాత్మికురాలు. భారత దేశంలో శక్తివంతమైన మీడియాల్లో ఒకటిగా ఉంటున్న టైమ్స్ గ్రూప్ సీఈఓగా వ్యవహరించడం అంటే ఎంతో కార్యదీక్ష, దక్షత ఉంటేగాని సాధ్యం కానిది. టైమ్స్ గ్రూప్ స్థాపించే సమయంలో భవిష్యత్తును అంచనా వేసి మరీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అచిర కాలంలోనే జాతీయస్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ టైమ్స్ పలువురి ప్రశంసలు అందుకుని ఖ్యాతి పొందింది.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా :
ఇది ప్రపంచ ఆంగ్ల పత్రికల్లో అత్యంత సర్క్యూలేషన్ ఉన్న పత్రికగా పేరుపొందింది.
ది ఎకానమిక్ టైమ్స్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఫైనాన్షియల్ దిన పత్రిక, ప్రపంచంలో ఇది రెండో స్థానంలో ఉంది.
మహారాష్ట్ర టైమ్స్ :
ఇది మహారాష్ట్ర రాష్ట్రం వరకు వస్తుంది. స్థానిక భాషలోనే ప్రచురితం అవుతోంది.
నవ భారత్ టైమ్స్ :
ఇది మన దేశ రాజభాష అయిన హిందీలో వస్తుంది. ఢిల్లీ, ముంబయ్‌లో ప్రచురణ కార్యాలయాలు ఉన్నాయి.
ముంబయ్ మిర్రర్ :
ఇది మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న కంపాక్ట్ దినపత్రిక.
కోల్‌కతా మిర్రర్, పూనే మిర్రర్, అహ్మదాబాద్ మిర్రర్, బెంగలూర్ మిర్రర్ :
ఇవి ఆయా ప్రాంతాల్లో అక్కడి భాషల్లో ప్రచురితం అవుతున్నాయి.
విజయ్ కర్నాటక :
కర్నాటకలో రెండ దిన పత్రికగా ఆవిష్కరించబడింది.
ఈటి వెల్త్ :
భారత దేశంలో అత్యధిక ఆదరణ ఉన్న ఫైనాన్షియల్ వార పత్రిక
ఫిల్మ్ ఫేర్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న మ్యాగ్జిన్.
ఫెమినా :
ఇది మహిళలు, అందం, లైఫ్ స్టైల్ కోసం రూపొందించిన మ్యాగ్జిన్.
ఈ పత్రికలు, మ్యాగ్జిన్లు అన్ని టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలోనూ ఈ పత్రికలు, మ్యాగ్జిన్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఓ మూవీ చానల్ కూడా ఈ గ్రూప్ నడుపుతోంది అది మూవీ నవ్. ఎఫ్ఎం రంగంలోనూ అడుగుపెట్టింది. రేడియో మిర్చి పేరుతో ఎంతో మంది శ్రోతలకు పలు ఆసక్తికర విషయాలను అందిస్తోంది.


వేల కోట్ల టర్నోవర్ గల సంస్థ పనుల్లో తలమునకలై ఉన్నా సామాజిక సేవ, ఆధ్యాత్మికాన్ని మాత్రం మరువలేదు. దీంతో కష్టాల్లో ఉన్న, మహిళా సాధికారత కోసం పోరాడుతున్న వారికి తన వంతు మద్దతు అందించేది. ప్రకృతి బీభత్సం సంభవించినప్పుడు నిరాశ్రయులుగా మిగిలిన బాధితులకు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి సహాయ సహకారాలు అందించేవారు. మన దేశంలో పలు తుపాన్, భూకంపాలు వచ్చినప్పుడు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే వచ్చే మానసిక ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా ఉండదని ఆమె పలుమార్లు చెబుతుంటారు.

ఇందు జైన్ మహిళ వింగ్ ఎఫ్ఐసిసి(ఎఫ్ఎల్ఒ)కు అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. అంతేకాకుండా భారతీయ జానపథ్ అనే ట్రస్ట్‌కు చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. జైన్ దక్షతతో పలు అవార్డులు సొంతం చేెసుకున్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన లిటరిసి అవార్డును అందుకున్నారు. భారతీయ జ్ఞానపీఠ ట్రస్టుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అమె 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిలో అత్మ విశ్వాసం, శాంతి మతపరమైన విషయాలపై ఈ సదస్సులో అనర్గళంగా చర్చించింది. జైన్ వ్యాపార విషయంలో మంచి ధనికురాలుగా పేరుపొందింది. రచయిత పట్ల కొంచెం అయోమయంగా ఉండేది. అలాంటి సంఘటనలు జరుగకుండా డిక్టిషన్‌గా రాసుకునేవారు. అంతేకాకుండా జైన్ ఛష్మే బద్దూర్ వంటి సినిమాలకు పాటలు కూడా రాశారు. దూరదర్శన్ వంటి కార్యక్రమాలకు ఇంటర్య్వూలు ఇచ్చేవారు.


సమాజంలో ఏకత్వం కోసం స్థాపించిన ఏకత్వ ఫోరంకు ఆమె దిశానిర్ధేశం చేస్తూ ఉంటారు.
ఈ ఫోరం 2003లో నాటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా
ఆవిష్కరించబడింది. ఫోరం అందిస్తున్న సేవలకు గాను మహాత్మా-మహావీర్ అవార్డును
అందుకుంది. సమాజంలో పలు మంచి పనుల కోసం ఈ ఫోరం కృషి చేస్తోంది.
ఇందులో మొదటిది శాంతి. దేశమే కాదు, ప్రపంచం అంతటా శాంతి నెలకొనాలన్నదే జైన్ ఆశయం. జైన్ ఆశోక్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు సమీర్ జైన్, వినీత్ జైన్.



1954లో సమీర్ జన్మించారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా మాతృ సంస్థ అయిన బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌కు ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, కళలు, సంస్క­ృతిని పోషకుడు. ఉపాధ్యక్షుడిగా ది టైమ్స్ గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందేలా చేయడం వెనుక ఈయన కృషి ఎంతో ఉంది. 1975లో బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యక్షుడి స్థాయి ఎదిగారు. 1986లో వినీత్ జైన్ కూడా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.