16, జూన్ 2013, ఆదివారం

తిరుమల రామచంద్ర



పరిశోధనా పారంగతుడు-

తిరుమల రామచంద్ర


సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు - తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన 'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు' అయినా, 'నుడి-నానుడి' అయినా 'సాహితీ సుగతుని స్వగతం' అయినా, 'మరుపురాని మనీషులు' అయినా, 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే 'పులిట్జర్' అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన 'హంపీ నుంచి హరప్పాదాకా' జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.
తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం 'మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు'. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం - 'నుడి-నానుడి'. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప - వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. 'సాహితీ సుగతుని స్వగతం', 'మరుపురాని మనుషులు' మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.
ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ - శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.
మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.
తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి 'హిందువుల పండుగలు-పర్వాలు', 'తెలుగు పత్రికల సాహిత్య సేవ', మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.
పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.
తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన 'పలుకుబడి'కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
- టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)

3, జూన్ 2013, సోమవారం

'తన్హాయి'

రాజేశ్వరిలా వెళ్లలేకపోయిన కల్హార జీవితం 'తన్హాయి'

"నా మనసులో నీకోసం ఒక చిన్న ప్లేస్, నా కోసం నీ మనసులో ఒక చిన్న ప్లేస్ దాచుకోవడం వల్ల ఈ పెళ్ళిళ్ళకు పెద్ద భూకంపాలు రావు'' అంటున్నాడు కౌశిక్.
"ఒకే ఒక్క రోజు మేమిద్దరం మా కోసం గడపాలని ఉంది. ఆ రోజు గడిచాక మేమిద్దరం ఒకే అనుభూతిగా మారిపోయిన తర్వాత ఆ స్మృతుల స్మరణతోనే నా జీవితమంతా గడిపేయాలని ఉంది'' పలవరిస్తోంది కల్హార.
అతి చిన్న ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణలోకి నడిచిన ఇద్దరు వివాహిత ప్రేమికుల కథ 'తన్హాయి'.
ం తొలి బ్లాగ్ సీరియల్‌గా 'తన్హాయి' నవలని పోస్ట్ చేస్తున్నపుడూ, ఆ తర్వాత మీ అనుభవాలు?
- 'తన్హాయీ' నవలను ఎప్పటికప్పుడు రాసి పోస్టు చేయడం ఒక కొత్త అనుభవమే కాకుండా ఒక మంచి అనుభవం కూడా. సీరియల్‌గా ఎప్పటిక ప్పుడు ఏ వారానికి ఆ వారం రాయడంలో కష్టసుఖాలు, మంచి చెడ్డలూ రెండూ ఉన్నాయి. తన్హాయి నవల మొదలుపెట్టే నాటికి బ్లాగుల్లో సీరియస్ సాహిత్య చర్చలు ఏవీ జరిగేవి కావు. కాబట్టి నవల బ్లాగులో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక రకమైన సంశయంతోనే ప్రారంభించాను. మొదటి నాలుగైదు వారాలు ఒకటో, అరో కామెంట్లు వచ్చేవి కానీ రీడర్స్ బాగానే చదువుతున్నట్లు హిట్స్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పాఠకుల సంఖ్య, కామెంట్లు, చర్చలు అన్నీ పెరిగాయి. నవల పూర్తి కాకుండానే దాని మీద అంచనాలు పెరిగిపోయాయి. తీవ్ర అభిమానులు, తీవ్ర వ్యతిరేకులు ఇద్దరూ ఏర్పడిపోయారు. ప్రతి వారం పోస్ట్ చేయగానే నేను రాసినది పాఠకులకు నచ్చినదో, లేదో తెలుసుకోవటానికి కామెంట్లు ఉపయోగపడినప్పటికీ, వాటి ప్రభావం నేను రాయబోయే ఇతర భాగాల మీద పడకుండా నేనురాయాలనుకున్నది రాయటానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా నా సాహిత్య కృషి అంతా ఒక ఎత్తు. తన్హాయి ఒక్కటే ఒక ఎత్తు అయింది. తన్హాయి అనేకానేక కొత్త రీడర్స్‌ని నాకు సంపాదించి పెట్టింది.
ం స్థల కాల నియంత్రణలూ మార్కెట్ ఒత్తిడులూ లేకుండా పూర్తిగా రచయితల స్వేచ్ఛపై నడిచే 'వ్యక్తిపత్రిక' లాంటిది బ్లాగ్. ఈ మాధ్యమంలో రాయడం వల్ల తన్హాయి నవల వస్తుశిల్పాలు ఏ మేరకు ప్రభావిత మయ్యాయి?
- వస్తువు విషయంలో ఎలాంటి ప్రభావం చూపించిందని నేననుకోవటం లేదు. అయితే శిల్పపరంగా కొంత ప్రభావం చూపించిం దనే అనుకుంటున్నాను. ఒక బ్లాగు పోస్టుగా ఆ వారం చదువు కోవటానికి వీలుగా రాసినప్పుడు శైలిలో కొంత పల్చదనం కానీ, లేదా మొత్తం నవలగా చూసినప్పుడు ఒకచోట ఎక్కడో ఏదో లింక్ పోయినట్లుగానో, లేదా విషయం కొంత సాగదీసినట్లుగానో అనిపించ టానికి ఆస్కారం కలిపించింది. ఉదాహరణకు నవలలో ఉత్తరం అనేది ఎలా కనుమరుగవుతోంది అన్న దాని గురించి రాసిన ఒక ఎపిసోడ్ ఉంది. అది బ్లాగులో వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ నవల మొత్తంగా చదివేటప్పుడు ఆ ఉత్తరాల గురించి కొంచెం ఎక్కువ రాసినట్లు నాకే అనిపించింది. అలాంటివి నవలలో రెండు, మూడు చోట్ల జరిగాయి.
మార్కెట్ ఒత్తిడులు లేకపోవచ్చేమో కానీ పాఠకుల కామెంట్ల ఒత్తిడి బ్లాగు రచనల మీద ఉంటుంది. ఏ రచయిత అయినా ఆ కామెంట్ల మాయాజాలంలో పడిపోయే ప్రమాదం ఉంది.
ం తన్హాయి నవలని అర్థం చేసుకోవడంలో వ్యాఖ్యానించడంలో అంత ర్జాల పాఠకులకి, ప్రింట్ పాఠకులకి మధ్య వైరుధ్యం ఏమైనా ఉన్నదా?
- చాలా తేడా ఉంది. అంతర్జాల పాఠకులు వేరు, ప్రింట్ పాఠకులు వేరు. అంతర్జాల పాఠకులు కొంత మెట్రో కల్చర్ తెలిసిన వారు. వాళ్లు నవలను అర్థం చేసుకున్న విధానానికి, ప్రింట్ పాఠకులు అర్థం చేసుకునే విధానానికి కొంత తేడా ఉంటుంది. అయితే నవల ఇద్దరినీ మెప్పించింది. ఆన్‌లైన్‌లోనూ, ప్రింట్‌లోనూ నవల సక్సెస్ అవటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే ఇప్పుడు తెలుగు సాహి త్యాన్ని ఎవరూ చదవటం లేదు, రీడర్స్ తగ్గిపోయారు అన్న వాదన, అలాగే నవలలు చదివే ఓపిక, తీరిక ఎవరికీ లేదు అన్న వాదన, అలాగే కొత్త తరం ముఖ్యంగా యువత తెలుగు పుస్తకాలు చదవటం లేదన్న వాదన.. ఈ మూడు కూడా తప్పని తన్హాయి నవలకు లభించిన స్పందనని బట్టి నాకర్థమయింది.
ఇక స్పందన విషయానికి వస్తే, నవల గురించి అంతర్జాల పాఠకులు ఏమనుకున్నారో తెలిసినట్లు ప్రింట్ పాఠకుల స్పందన నాకు పూర్తిగా తెలియలేదు. ఆన్‌లైన్ పాఠకులు ఏ వారానికి ఆ వారం నవల చదవటంలో ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి కనపర్చారు. మొత్తంగా ఒక పాత్రను అర్థం చేసుకునే వీలు కేవలం ఒక ఎపిసోడ్ చదవటంతో సాధ్యం కాదు. అయినప్పటికీ వాళ్లు ప్రతివారం ఆ ఎపిసోడ్ చదవి, దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని చర్చ చేసి మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూసేవారు. ప్రింట్ పాఠకుల విషయానికి వస్తే అలా కాదు. వాళ్లు మొత్తం పుస్తకం ఒకేసారి చదివారు, వారి స్పందన తెలిపే అవకాశం పరిమితమయింది. కేవలం ఈ మెయిల్స్, ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే చాలామంది స్పందనను తెలియచేసారు.
ం తన్హాయి నవల సాంప్రదాయక తత్వం ఉన్న పాఠకులకి రాడికల్‌గానూ, స్త్రీ పురుష సంబంధాలను రాడికల్ దృష్టి కోణంతో చూడగలిగిన పాఠకులకు సాంప్రదాయకంగానూ కనపడింది. ఈ ద్వంద్వాన్ని మీరెలా వ్యాఖ్యానిస్తారు?
- ద్వంద్వం అనటం కన్నా, ఒకొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకొని వ్యాఖ్యానించారనే నేననుకుంటున్నాను. కేవలం ముగింపు చూసి సాంప్రదాయకం, యాంటీ ఫెమినిజం అని కొందరు, అసలు వివాహా నంతర ప్రేమ అనేది రాడికల్ ఫెమినిజం అని కొందరు వ్యాఖ్యానిం చారు. నేను ఫెమినిజాన్ని సమర్ధిస్తూ, లేదా దాన్ని గౌరవిస్తూ రాయలేదని కొందరు విమర్శిస్తే, నేను అక్రమ సంబంధాలను ప్రోత్సహించటానికే ఇలాంటివి రాశానని మరి కొందరు దుయ్య బట్టారు. రెండు విమర్శలకు నా సమాధానం ఒక్కటే. అది ఏ వాదం కోసం రాసినది కాదు. అదొక నలుగురి జీవితానికి చిత్రిక. అది వాదాల్లో ఒదుగుతుందా? లేదా? అనే వాదనే అసంబద్ధం.
నవల మొత్తాన్ని ముగింపు నుంచి చూసి అది సాంప్రదాయకమని వ్యాఖ్యానించటం సరికాదేమో అంటాను. ఈ నవలలో ముగింపు కంటే కీలకమైనది కల్హార సంఘర్షణ. కుటుంబాన్ని వదిలి వెళ్ళటం, వెళ్లలేకపోవటం అనేవి ఆయా వ్యక్తుల/పాత్రల పరిస్థితులు, వ్యక్తిత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయినా నవలలో ఇచ్చిన ముగింపు ఒక విధమైన మిడిల్ స్టెప్. ఆ తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో సంఘర్షణ ఉంటుంది. నవలకు ఆ విధమైన వస్తువు తీసు కోవటంలోనే ఒక రకమైన రాడికల్ ధోరణి ఉంది.
కల్హార జీవితంలోకి కౌశిక్ వచ్చాక కల్హార ఆలోచనల్లో కలిగిన మార్పు, సంఘర్షణ, కుటుంబ జీవితం పట్ల ఆమెకున్న అభిప్రాయాలు, చైతన్యతో ఆమె నిజాన్ని ఒప్పుకున్న తీరు, రికన్సిలేషన్ ప్రాసెస్‌కు సిద్ధం కావటం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ ఆధునిక లేదా సమకాలీన జీవితపు చిత్రణ. ఇది నవలలో ఎలా చిత్రతమయింది అన్నది చూడగలిగితే బావుంటుంది.
ం స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధాలని చెప్పబడే వాటిలోని స్వేచ్ఛా రాహిత్యం, మానవీయమైన ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణ, వైవాహికేతర ఆకర్షణలున్నా అంతిమంగా కుటుంబ విలువలకే కట్టుబడి ఉండడం తన్హాయిలో కనిపించాయి. ఈ నవల ద్వారా మీరు ప్రతి పాదించదల్చుకున్న సారాంశం ఏంటి?
- నేను 2010లో తన్హాయీ రాయటానికి ముందే ఇద్దరు మహా రచయితలు రాసిన రెండు క్లాసిక్స్ నా ముందున్నాయి. ఒకటి చలం రాసిన 'మైదానం', రెండోది టాల్‌స్టాయ్ రాసిన 'అన్నా కెరీనీనా'. రెండూ నాకు ఇష్టమైన పుస్తకాలు, నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు. కానీ ఆ రెండు పుస్తకాలు ఎంత నచ్చినా ఇంకా ఏదో చెప్పలేదనే అసంతృప్తి నాకు ఉంది. రాజేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత జీవితం రాశాడు చలం. వెళ్లటానికి ముందు ఎలాంటి ఘర్షణ చూపించలేదు. అసలు ఎలాంటి ఘర్షణ ఉంటుంది, దాన్ని ఏ స్త్రీ అయినా ఎలా అనుభవిస్తుంది? లేదా ఎలా అధిగమిస్తుంది అన్నది ఎక్కడా ప్రస్తావనకు రాదు 'మైదానం'లో. అలాంటి ఘర్షణ రాయాల్సిన అవసరం లేని నవల 'మైదానం'. అన్నా కెరీనీనా ది మరో రకమైన ఘర్షణ, వేదన. అయితే ఆ ముగింపును, ఆ ఘర్షణను కూడా ఒకొక్కరూ ఒక్కోలా చూస్తుంటారు. ఒకసారెప్పుడో నా ముందు తరం రచయిత ఒకరు ఏదో మాటల సందర్భంలో నాతో, అలాంటి పనులు చేస్తే అలాంటి ముగింపే లభిస్తుందని స్త్రీలకు హెచ్చరికగా టాల్‌స్టాయ్ ఆ ముగింపు ఇచ్చాడు అన్నారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాను. ఆ రెండు పాత్రలకు మధ్య ఉన్న ఎందరో స్త్రీలు నా కళ్ల ముందు కనిపించారు. అలా వెళ్లలేకపోయిన ఎంతోమంది కల్హారల జీవితం తన్హాయి. చలం మైదానం వచ్చాక కూడా కుటుంబాన్ని వదిలి వెళ్లగలిగిన రాజేశ్వరుల కంటే, వెళ్లకుండా ఉండిపోయిన కల్హారలే ఎక్కువమంది ఉన్నారు. వెళ్లలేక పోవటంలోని బాధను, వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధ ఘర్షణను రాశాను. అలాగే వివాహానంతరం కూడా ఇష్టాలు కలగవచ్చునన్నది నవలలో చర్చించిన అంశం, అయితే ఆ ఇష్టం ప్రస్తుత సంబంధం మీద నిరసనతోనో, తిరుగుబాటుగానో కలగడం కాదు. కేవలం ఇష్టం, ఇష్టంగా మాత్రమే నవలలో నేను చిత్రీకరించాను. ఒక వ్యక్తి మీద కలిగే ఇష్టాన్ని ఒక పూలమాల కట్టినట్లు రాశాను. ఆ క్రమ వర్ణన నవలకు ఓ ప్రత్యేకతను, ఓ విశిష్టతను చేకూ ర్చిందనుకుంటున్నాను.
ఈ వందేళ్లలో ఎంతోమంది రాజేశ్వరులను, అన్నా కెరీనినాలను ఈ సమాజం చూసి ఉంటుంది. అయితే ఎంతమంది మేము రాజేశ్వరులం అని ధైర్యంగా ప్రకటించుకున్నారు? ఎంతమంది రాజేశ్వరితో తమను తాము కనెక్ట్ చేసుకున్నారు? అన్నది ఆలోచించాలి. తన్హాయి వచ్చాక ఎంతోమంది పాఠకులు ధైర్యంగా మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని రాశారు. ఒక పాత్ర నచ్చటం వేరు, ఆ పాత్రతో కనెక్ట్ కావటం వేరు. రీడర్స్ కల్హారతో కనెక్ట్ అయ్యారు. అది ముఖ్యం. ఒక రచయితకు కానీ, ఒక పుస్తకానికి కానీ అంతకుమించి కావాల్సిందే ముంటుంది?
ం తన్హాయి నవల రాస్తున్నపుడు మీలోని వ్యక్తికీ రచయితకూ మధ్య ఏకీభావం ఉన్నాదా? (ఘర్షణ ఉంటే ఏ అంశాల్లో?)
- సాహిత్య సృజనలో అన్నీ మన నమ్మకాలకు, విశ్వాసాలకు, దృక్పథాలకు సంబంధించినవి మాత్రమే రాయలేము. మనం అంగీకరిం చని విషయాలను కూడా పాత్రల స్వభావాల రీత్యా రాయాల్సి వస్తుంది. పాత్రలను మన చెప్పు చేతల్లో పెట్టుకోకుండా, స్వేచ్ఛగా వాటిని ప్రవర్తింపచేయటం సరైనదని ప్రతి రచయిత నమ్ముతారు. అయితే అది ఒక్కోసారి సాధ్యం అవుతుంది. కాకపోతుంది. తన్హాయి విషయానికి వస్తే, నాలోని వ్యక్తికి, రచయితకు మధ్య ఏకీభావంతోనే రాశాను.
ం తన్హాయి ద్వారా మీకు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి కదా.. ఆ ప్రస్పందనల్లో మీకు దొరికిన ఆణిముత్యాలు? (వ్యక్తుల పేర్లు కాకుండా సామూహికమైన స్పందనలను చెప్పాల్సిందిగా మనవి.)
- హాహాహాహా. అభిమాన సంఘాల్లేవు. ఏమీ లేవు. ఫేస్‌బుక్‌లో తన్హాయీ నవల మీద చర్చించడానికి ఒక గ్రూప్ ఏర్పడింది. పుస్తకం వచ్చి ఏడాది దాటింది అయినా ఇప్పటికీ ఎవరో ఒకరి నుంచి మీ నవల చదివాము. బాగా నచ్చింది అంటూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒక రచయితగా నా కృషి సఫలమైందని సంతోషంగా అనిపిస్తుంది. ఆణి ముత్యాలు అరుదుగా ఉంటాయి కానీ నాకు తన్హాయి విషయంలో ఎక్కువగానే లభించాయి. నవలలో చిన్న చిన్న తప్పులు సరిచేసుకొని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే తెలుగులో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటిగా మిగిలిపోయి ఉండేదన్న సద్విమర్శను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.
వందలాది కామెంట్లు నుంచి నేను మర్చిపోలేని కామెంట్ ఆనానిమస్ పేరుతో వచ్చింది. జరిగిన విషయం చైతన్యతో కల్హార, చెప్పేశాక వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ తర్వాత ఆ అమ్మాయి ఆ కామెంట్ బ్లాగులో పోస్ట్ చేసింది. కల్హార చెప్పినట్లు తాను చెప్పలేకపోయానని, ఈ నవలను నేను ఇంకొంచెం ముందు రాసి ఉంటే తన జీవితమే మారిపోయి ఉండేదని, ఆమె ఎప్పటికీ నన్ను మర్చిపోలేనని కామెంట్ రాసింది. ఇలా నిజజీవితంలో నుంచి ఎందరో కల్హారలు ధైర్యంగా ముందుకు వచ్చి మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని చెప్పారు. అవన్నీ నాకు దొరికిన ఆణిముత్యాలే. పుస్తకాలు మనుష్యులను ప్రభావితం చేస్తాయన్న విషయం మనందరికీ స్వానుభవమే అయినా ఒక రచయితగా కొంతమంది పాఠకులకు ఈ పుస్తకం ఎంత ఇష్టమయిందో, ఎంత అపురూపమయిందో తెల్సుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను.
ం తన్హాయి ముగిసిందా? కొనసాగుతుందా?
- తన్హాయి పూర్తి కాలేదు. పుస్తకంగా ఒక ముగింపు ఇచ్చాను. నేనిచ్చిన ముగింపు తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో ఘర్షణ ఉంటుంది. కథను కొనసాగిస్తూ ఆ ఘర్షణను కూడా చిత్రిస్తూ తన్హాయి రెండో భాగం రాయమని ఎంతోమంది అడుగుతున్నారు కానీ రాయగలనో, లేదో చెప్పలేను. తన్హాయికి మరో రకమైన కొనసాగింపుతో ఇంకో నవల మాత్రం రాస్తున్నాను.
కల్పనా రెంటాల
ఫోన్: 001-512-5355895
 

22, ఏప్రిల్ 2013, సోమవారం

నీలంరాజు

నీలంరాజుగారి సంపాదకత్వం
nagasuri-book-photo‘కథ నడిపిన తీరు బాగానే ఉంది- ఇతివృత్తం నాకు సమ్మతం కాదు’
‘ఇతివృత్తంతో మాకేమి పని? రచన బాగుంది కదా? వేయండి!’
‘అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలు పడదు’
‘క్రమ, అక్రమ సంబంధాల గురించి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసి ఉం టే వేయడమే’
‘ఎడిటర్‌ పోస్ట్‌ మా న్‌ కాదు. పాఠకుల ఎడల అతనికో బాధ్యత ఉంది’
‘ఎడిటర్‌ కర్తవ్యమంతే అయి ఉండాలి’
ఈ ఎడిటర్‌ అట్లా అనుకోవడం లేదు’
- ఇలా రచనను తిరస్కరించింది ‘నవోదయ’ వార ప్రతిక సంపాదకుడు నీలంరాజు వేంకట శేషయ్య. తన మిత్రుడి రచనను ప్రచురింపచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మరో విఖ్యాత పాత్రికేయు డు, సంపాదకుడు గోరా శాస్ర్తి అని తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు. అప్పటి గోరా శాస్ర్తి అదే నవోదయంలో ‘చేగోడీలు తింటూ’ అనే కాలమ్‌ అప్పుడే రాస్తుండడం గమనార్హం. ఇక్కడ నీలంరాజుగారి భావజాలం, గోరా శాస్ర్తిగారి లిబరలిజం బయటపడతాయి.

ఇరవై ఏళ్ళు ఆంధ్ర పత్రికలో, మరో ఇరవయ్యేళ్ళు ఆంధ్ర ప్రభలో పనిచేసిన నీలంరాజు వేంకట శేషయ్యగారి గురించి వారి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఇటీవల ‘కంచి పరమాచార్యుల ప్రియ శిష్యుడు, పత్రికారంగ నిర్దేశకుడు నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని అన్ని సంగతుల గురించి రాసే జర్నలిస్టుల జీవిత విశేషాలు తక్కువగా వెల్లడి అవుతుంటాయి. సంగీతం, నాటక రంగం, సినిమా, ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యేక ఆసక్తి గల నీలంరాజు బాగా రాణించిన పాత్రికేయుడు. 1905 డిసెంబర్‌ 22న జన్మించిన నీలంరాజు ప్రకాశం పంతులు సహాయకుడుగా మొదలై, చివరకు ఒక పెద్ద పత్రిక ఎడిటర్‌గా రూపొందారు. స్వరాజ్య, ఆంధ్రపత్రిక, నాట్యకళ, నవోదయ, ఆంధ్రప్రభ- ఇదీ వారి పత్రికా ప్రస్థానం. 1938లో ఉషాపరిణయం సినిమాలో అనిరుద్ధ పాత్ర వేసిన అందమైన కథానాయకుడు కూడా ఆయనే. భద్రాచలం దేవాలయం జీర్నోద్ధరణకు పత్రికను వినియోగించి ఫలితం సాధించినవారు ఆయన. పరమాచార్య గురించి ‘నడిచే దేవుడు’ అనే పుస్తకరం ప్రచురించిన భక్తుడు కూడా ఆయనే!
‘నాకు అప్పుడు కనిపించింది విషాద యోగంలో మునిగిన విజయుడు కాదు; హాలాహలం మింగిన హరుడు. ఏమా ఠీవి! ఏమా దర్పం! ఎంత రాజసం! ఎవరిలో చూడగలం ఆక్షాత్ర తేజం! మూర్తీభవించిన వీర రసమా? కదలి వచ్చి హిమవన్నగమా?’

- మహాత్మా గాంధీతో విభేదాలు వచ్చినప్పుడు ప్రకాశం పంతులు సంకట స్థితి గురించి వివరించే సందర్భంలో నీలంరాజు కలం చెక్కిన అక్షర శిల్పం ఇది. ఈ పుస్తకంలో అనుబంధంగా ప్రకాశంగారి వాత్సల్యం గురించి, భద్రాచలం రామదాసు ధ్యాన మందిరం గురించి రెండు వ్యాసాలను ఇచ్చారు. ఈ రెండు వ్యాసాల్లో వస్తువు విషయం ఒక వైపు ఉండగా; నీలంరాజుగారి రచనా శైలి చక్కగా పరిచయం చేయడమనేది మరోవైపు స్పష్టంగా కనబడుతుంది.

- పుస్తకం అట్ట మీద పుస్తకం పేరు ఒక విధంగా ఉండగా, లోపలి అట్ట మీద, ప్రతి పుటలోనూ పుస్తకం పేరు ‘మా తండ్రి శేషయ్య గారు’. నిజానికి ఇక్కడేదో సమన్వయ లోపంతో ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ ‘మా తండ్రి శేషయ్య గారు’ అన్నదే సరైన మకుటమని పిస్తుంది. వారి మొదటి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఫస్ట్‌ పర్సన్‌లో చెప్పిన విషయాలకు ఇదే సరైన శీర్షిక కూడా. శేషయ్యగారి జీవిత చరిత్ర ఏదీ లేని సమయంలో ఈ పుస్తకం ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది. జాతీయోద్యమం, విద్యార్ధి దశ, మద్రాసు జీవనం, స్వరాజ్య, ఆంధ్ర పాత్రిేయం, కళాభినివేశం, విదేశీ యాత్రలు- చేసినవీ, విరమించినవీ, నవోదయ, ఆంధ్ర ప్రభ, రామ కార్యాలు, ఆఖరిమలుపులు- ఇవీ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు.

- కొన్ని పుస్తకాలు చేతికి రాగానే ఆ రాత్రో, మరుసటి రోజో చదివేసే సందర్భం ఉంటుంది. అది వేళా విశేషం కాదు. కానీ ఆ పుస్తకం దేని గురించి, ఎవరు రాసింది, మనకు ఉన్న సమయం వంటి అంశాలపై చదవడమనేది ఆధారపడి ఉంటుంది. నన్ను అలా చదివించిన ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మద్రాసునుండి బ్రిటిష్‌వారి అనుకూల పత్రిక మద్రాసు మెయిల్‌, మితవాద పత్రిక ది హిందూతో పాటు గర్జించే ‘స్వరాజ్య’ ఆంగ్లంలో ఉండగా, ఆంధ్రపత్రిక తెలుగులో ఉండేది. ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరేడు గంటల మధ్య కాలంలో విడుదలయ్యేవి.

చాలా కాలం పాటు రిపోర్టర్‌గా ఉన్న కాలంలో కూడా ఆంధ్రపత్రికలో సినిమా పేజీని నీలంరాజు నిర్వహించేవారు.

మొదట హిందూ, ఆంధ్రపత్రిక రెండూ తొలి పేజీలో ప్రకటనలు ఇచ్చేవి. హిందూ తొలి పేజీలో వార్తలు వేసినప్పుడు ఆంధ్రపత్రిక కూడా మార్చింది.

ఆంధ్రపత్రికలో సంపాదకత్వం ముగిసిన తర్వాత 1970- 71లో నీలంరాజు భద్రాచలం ఎటపాక గ్రామంలో వ్యవసాయం చేశారు. దీన్ని నార్ల వెంకటేశ్వరరావు బ్రాహ్మణ వ్యవసాయం అన్నారు.
పత్రికల పేర్లలో వత్తులుండకూడదు. రైల్వే స్టేషన్‌లో పేపర్‌ బాయ్‌ కూడా పలకడానికి సులువుగా పేరుండాలని నీలంరాజు ‘నవోదయ’ అనే పేరును వారపత్రికకు స్వీకరించారు. శ్రీశ్రీ ఎంతటి ఇమేజరీ ప్రవేశపెట్టి రాత రాసేవారో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవారు.
‘నవోదయ’తో చితికి పోయిన నీలంరాజును 1949- 50 లలో నార్ల అడిగి ప్రభలో చేర్పించుకున్నారు. నీలంరాజు ఎడిటోరియల్‌ రైటర్‌గా చేరి, 1959లో ఎడిటర్‌ అయ్యారు.

‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ గొప్ప ఎడిటర్‌ ఎస్‌. సదానంద్‌ వీరుడిలా బతికి బొంబాయిలో చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు. ఇది తెలిసి రామనాథ్‌ గోయంకా ప్రత్యేకంగా విమానంలో సదానంద్‌ దేహాన్ని మద్రాసు తెప్పించి, అంత్యక్రియలు జరిపించారు.
- నీలంరాజు గారి మరిన్ని వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తకాలు చదవాలని ఆసక్తి కలిగించే రీతిలో ఈ పుస్తకం రచించిన లక్ష్మీ ప్రసాద్‌కు అభినందనలు. 

(నాగసూరి వేణుగోపాల్.....వ్యాసం)
|

ఇందు

ఇందు `జై`న్
పత్రికను నడిపించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అందునా ఆంగ్ల పత్రిక అంటే ఎంతో శ్రమ, ఆర్థికంతో కూడుకున్న పని. అలాంటిది ఒకటి కాదు దాదాపు పత్రికలు, మ్యాగజైన్‌లు కలిపి 15 వరకు ప్రచురితం చేస్తున్నారు. ఐదు భాషల్లో వివిధ రకాలుగా వీటిని అందిస్తున్నారు. ఇవన్నీ కూడా టైమ్స్ గ్రూప్‌ కింద నడుస్తున్నాయి. వందల కోట్లతో ఇంత పెద్ద మొత్తంలో సడుస్తున్న సంస్థ చైర్మన్‌ మహిళ అంటే ఆశ్చర్యపోక తప్పదు. మీడియా రంగాన్ని తలలు పండిన హేమాహేమీలే నిర్వహించలేక సతమతమవుతుంటారు. అలాంటిది ఓ మహిళ ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా పత్రికను నడిపించడం ఆమె కృషికి, కార్యదక్షతకు నిదర్శనం అని చెప్పవచ్చు. 77 ఏళ్ల ఆ మహిళే ఇందూ జైన్‌.


- టైమ్స్ గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు
- గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి
- కొత్త పత్రికలు, మ్యాగజైన్ల ఆవిష్కరణ
- 5 భాషల్లో పలు దిన పత్రికలు
- సాయం అందించడంలోనూ ముందే
- మానవతావాదిగా గుర్తింపు
- ఆధ్యాత్మికవేత్త, రచయిత్రి కూడా


దేశంలో అత్యంత పెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి(టైమ్స్ గ్రూప్) సారథిగా వ్యవహరిస్తున్నారు. ఇందు జైన్ షాహు కుటుంబానికి చెందింది. బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీ సారథిగా వ్యవహరించడమే కాకుండా అమె విద్యావేత్త, మానవాతవాది, కళ పోషణ కలిగిన అధ్యాత్మికురాలు. భారత దేశంలో శక్తివంతమైన మీడియాల్లో ఒకటిగా ఉంటున్న టైమ్స్ గ్రూప్ సీఈఓగా వ్యవహరించడం అంటే ఎంతో కార్యదీక్ష, దక్షత ఉంటేగాని సాధ్యం కానిది. టైమ్స్ గ్రూప్ స్థాపించే సమయంలో భవిష్యత్తును అంచనా వేసి మరీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అచిర కాలంలోనే జాతీయస్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ టైమ్స్ పలువురి ప్రశంసలు అందుకుని ఖ్యాతి పొందింది.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా :
ఇది ప్రపంచ ఆంగ్ల పత్రికల్లో అత్యంత సర్క్యూలేషన్ ఉన్న పత్రికగా పేరుపొందింది.
ది ఎకానమిక్ టైమ్స్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఫైనాన్షియల్ దిన పత్రిక, ప్రపంచంలో ఇది రెండో స్థానంలో ఉంది.
మహారాష్ట్ర టైమ్స్ :
ఇది మహారాష్ట్ర రాష్ట్రం వరకు వస్తుంది. స్థానిక భాషలోనే ప్రచురితం అవుతోంది.
నవ భారత్ టైమ్స్ :
ఇది మన దేశ రాజభాష అయిన హిందీలో వస్తుంది. ఢిల్లీ, ముంబయ్‌లో ప్రచురణ కార్యాలయాలు ఉన్నాయి.
ముంబయ్ మిర్రర్ :
ఇది మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న కంపాక్ట్ దినపత్రిక.
కోల్‌కతా మిర్రర్, పూనే మిర్రర్, అహ్మదాబాద్ మిర్రర్, బెంగలూర్ మిర్రర్ :
ఇవి ఆయా ప్రాంతాల్లో అక్కడి భాషల్లో ప్రచురితం అవుతున్నాయి.
విజయ్ కర్నాటక :
కర్నాటకలో రెండ దిన పత్రికగా ఆవిష్కరించబడింది.
ఈటి వెల్త్ :
భారత దేశంలో అత్యధిక ఆదరణ ఉన్న ఫైనాన్షియల్ వార పత్రిక
ఫిల్మ్ ఫేర్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న మ్యాగ్జిన్.
ఫెమినా :
ఇది మహిళలు, అందం, లైఫ్ స్టైల్ కోసం రూపొందించిన మ్యాగ్జిన్.
ఈ పత్రికలు, మ్యాగ్జిన్లు అన్ని టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలోనూ ఈ పత్రికలు, మ్యాగ్జిన్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఓ మూవీ చానల్ కూడా ఈ గ్రూప్ నడుపుతోంది అది మూవీ నవ్. ఎఫ్ఎం రంగంలోనూ అడుగుపెట్టింది. రేడియో మిర్చి పేరుతో ఎంతో మంది శ్రోతలకు పలు ఆసక్తికర విషయాలను అందిస్తోంది.


వేల కోట్ల టర్నోవర్ గల సంస్థ పనుల్లో తలమునకలై ఉన్నా సామాజిక సేవ, ఆధ్యాత్మికాన్ని మాత్రం మరువలేదు. దీంతో కష్టాల్లో ఉన్న, మహిళా సాధికారత కోసం పోరాడుతున్న వారికి తన వంతు మద్దతు అందించేది. ప్రకృతి బీభత్సం సంభవించినప్పుడు నిరాశ్రయులుగా మిగిలిన బాధితులకు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి సహాయ సహకారాలు అందించేవారు. మన దేశంలో పలు తుపాన్, భూకంపాలు వచ్చినప్పుడు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే వచ్చే మానసిక ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా ఉండదని ఆమె పలుమార్లు చెబుతుంటారు.

ఇందు జైన్ మహిళ వింగ్ ఎఫ్ఐసిసి(ఎఫ్ఎల్ఒ)కు అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. అంతేకాకుండా భారతీయ జానపథ్ అనే ట్రస్ట్‌కు చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. జైన్ దక్షతతో పలు అవార్డులు సొంతం చేెసుకున్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన లిటరిసి అవార్డును అందుకున్నారు. భారతీయ జ్ఞానపీఠ ట్రస్టుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అమె 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిలో అత్మ విశ్వాసం, శాంతి మతపరమైన విషయాలపై ఈ సదస్సులో అనర్గళంగా చర్చించింది. జైన్ వ్యాపార విషయంలో మంచి ధనికురాలుగా పేరుపొందింది. రచయిత పట్ల కొంచెం అయోమయంగా ఉండేది. అలాంటి సంఘటనలు జరుగకుండా డిక్టిషన్‌గా రాసుకునేవారు. అంతేకాకుండా జైన్ ఛష్మే బద్దూర్ వంటి సినిమాలకు పాటలు కూడా రాశారు. దూరదర్శన్ వంటి కార్యక్రమాలకు ఇంటర్య్వూలు ఇచ్చేవారు.


సమాజంలో ఏకత్వం కోసం స్థాపించిన ఏకత్వ ఫోరంకు ఆమె దిశానిర్ధేశం చేస్తూ ఉంటారు.
ఈ ఫోరం 2003లో నాటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా
ఆవిష్కరించబడింది. ఫోరం అందిస్తున్న సేవలకు గాను మహాత్మా-మహావీర్ అవార్డును
అందుకుంది. సమాజంలో పలు మంచి పనుల కోసం ఈ ఫోరం కృషి చేస్తోంది.
ఇందులో మొదటిది శాంతి. దేశమే కాదు, ప్రపంచం అంతటా శాంతి నెలకొనాలన్నదే జైన్ ఆశయం. జైన్ ఆశోక్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు సమీర్ జైన్, వినీత్ జైన్.



1954లో సమీర్ జన్మించారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా మాతృ సంస్థ అయిన బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌కు ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, కళలు, సంస్క­ృతిని పోషకుడు. ఉపాధ్యక్షుడిగా ది టైమ్స్ గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందేలా చేయడం వెనుక ఈయన కృషి ఎంతో ఉంది. 1975లో బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యక్షుడి స్థాయి ఎదిగారు. 1986లో వినీత్ జైన్ కూడా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

3, మార్చి 2013, ఆదివారం

మధునాపంతుల

ఆంధ్ర రచయితల రచయిత
Untitled-2ఆదికవి నన్నయా, కాదా అని ఇప్పటికీ సాహిత్య విమర్శ కులు, చరిత్ర పరిశోధకులు తర్జన భర్జన పడు తూ ఉన్నారు. అయితే నన్నయ కన్నా ముందుతరాల్లోనే కొంత మంది రాసిన తెలుగు పద్యాలు అక్కడక్కడా బయట పడ్డాయి. మహా భాగవతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ ‘నానా రుచిరార్ధసూక్తినిధి’గా కవి పండితులకు మార్గదర్శకుల య్యారు. ఆయన నడిచిన దారి లోనే నడిచి విశేష సాహితీ ప్రజ్ఞను ఆవిష్కరిం చారు ‘మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తి’. ఆదికవి నన్నయను ప్రేరణగా తీసుకొని సాహి తీయజ్ఞం చేసిన వారిలో అగ్రగణ్యులు మధునాపంతుల. ఆధునిక సాహితీయుగంలో కూడా అభినవ నన్నయగా గుర్తింపు పొందినది మధునాపంతుల ఒక్కరే.

ఆయనకు నన్నయపై భక్తి ప్రపత్తులు, గౌరవభావం ఎలాంటివో ఆయన రాసిన ఈ పద్యం చదివితే ప్రస్ఫుటమౌతుంది- ‘కాలంబెంత గతించి పోయినను ఆకల్పాంత సంస్థాయిగా/ నేలన్‌ నిల్వఁగఁ జూలు వ్యాస కవితా నిర్మాణమునన్‌ బాసలో/ నాలాపింపఁగ పంచ మ శృతి గరీయ స్వాదు సన్మాధురీ/ శ్రీలన్‌ నన్నయ కోకిలంబు సవరించెన్‌ గంటపున్కంఠమున్‌’ (ఎంతకాలము గడిచిపోయినప్పటికీ ఆకల్పాంతమూ స్థిరమైన వ్యాసకవి కృత జయమను పేరుగల మహాభారతాన్ని తెలుగు భాషలో ఆలపించుకునే విధంగా పంచమ శృతి (శృతి= వేదము, పంచమ శృతి= పంచమవేదము)లో సన్మాధురీ శ్రీలను నన్నయ అనే కోకిల గంటమనే కంఠంతో సవరించెను).ఒక అసమాన ప్రతిభాశాలి అయిన నన్నయకు మరో అసమాన ప్రతిభా శాలి అయిన మధునాపంతుల వారు ఇచ్చిన అపూర్వ నిర్వచనమిది.

మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తి, నన్నయ స్ఫూర్తిని మరింత ముందుకు తీసు కువెళ్లి నవీనాంధ్ర సాహితీలోకంలో సంప్రదాయ కవితాపరిరక్షణచేస్తూ అటు సంప్రదా యవాదులకు, ఇటు నవీనపథగాములకు ఆమోద యోగ్యమైన రచనలుచేశారు. ఆక్ర మంలోనే ఆంధ్రపురాణాన్నిరాసి ఆంధ్రోద్యమానికి ఎనలేని కృషిచేశారు. ఆంధ్రరచయి తలు అనే బృహత్కంగ్రంథం రాసి 113 మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ చేశారు. మధునాపంతుల 1920 మార్చి 5న కోనసీమలోని ఐలెండ్‌ పోలవరంలో మాతామహు లు ఆకొండి రామమూర్తి శాస్ర్తి ఇంట జన్మించారు. ఆయన తండ్రి మధునాపంతుల సత్యనారాయణమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యునిగా గుర్తింపు పొందారు. సంస్కృతాం ధ్రభాషల్లో గణనీయమైన పాండిత్యాన్ని సముపార్జించారు.

మధునాపంతులకు చిన్ననాట తొలిగురువు ఆయన తండ్రే. ఆయన ప్రోత్సాహంతో, తనగురువైన పిఠాపురం సంస్థాన ఆస్థానకవి ఓలేటి వెంకటరామశాస్ర్తి ఆశీస్సులతో బాల్యంలోనే మధురమైన ఛందో బంధాలతో కవితలల్లి సత్యనారాయణశాస్ర్తి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇరవై యేళ్లు వచ్చేసరికే మధునాపంతుల చిక్కని పద్యరచన, చక్కని గద్య రచనలో ఆందెవేసిన చేయిగా పేరుపొందారు.
తమ స్వగ్రామం దగ్గరలోని ఇంజరం గ్రామం లోగల మహేంద్రవాడ సుబ్బరాయశాస్ర్తి సన్ని ధిలో వ్యాకర ణశాస్త్రాన్ని సంస్కృత నాటకాలం కారాలను అధ్యయనం చేశారు. 1940లో మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్వాన్‌ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదేఏడాది సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి షష్ఠిపూర్తి వేదికపై మధునాపం తులవారి ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది.

ఆ సభకు సర్‌ సివి రామన్‌ అధ్యక్షులు. అంతకు ముందే చిలకమ ర్తి లక్ష్మీనరసింహం అధ్యక్షతన కాకినాడలోజరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాలలో ఒక అవిస్మరణీయ ప్రసం గాన్నిచేశారు. ఇదే ఆయన తొలిప్రసంగం. ఆసమయం లో ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టింది మధునా పంతులవారే. నన్నయ ప్రేరణతో ‘ఆంధ్రపురాణం’ రచించారు. ఈ కావ్యం మధునా పంతుల వారికి ఆంధ్రసాహిత్య అకాడమీ పురస్కృతిని అందించింది. అనన్యమైన ఆంధ్రాభిమానంతో మధునాపంతుల పంతొమ్మిదోయేట పల్లెప్రజల్లో విద్యాభివృద్ధికీ, విజ్ఞానదృష్టికీ కృషి సల్పారు. పల్లిపాలెంలో ఆంధ్ర కుటీరాన్ని ప్రారంభించారు.
1939 మార్చిలో ‘ఆంధ్రి’ అనే మాసపత్రిక ప్రారంభించారు.

ఈపత్రిక మూడేళ్ల పాటుమాత్రమే కొనసాగిసప్పటికీ ఆంధ్రసాహితీలోకానికి విశేషసేవలు అందించిం ది.1941 నవంబర్‌లో ఈపత్రిక ఆగిపోవడం విషాదవిష యమే.ఆనాటికి సుప్రసిద్ధులైన ఆంధ్రరచయితల జీవనరేఖలను వారి సాహితీప్రతిభతో కలిపి ‘ఆంధ్రి’ పత్రికలో వరుస గా ప్రచురించారు. ఇలా 44 మంది రచయితలగురించి 1944లో ‘ఆంధ్ర రచయితలు’ తొలి సంపుటిని ప్రకటించారు. ఆ తర్వాత 1950లో 101మంది రచయితల సాహిత్య జీవిత విశేషాలతో సమగ్రమైన సంపుటాన్ని ఆద్దేపల్లి అండ్‌కో వారు ప్రచురించారు. ఆయన కుమారులు సీనియర్‌ పాత్రికేయులు మధునా మూర్తి, మధునాపం తుల సత్యనారాయణమూర్తి, ఆయన మనుమడు మధునాపంతుల శేషాద్రి శేఖర్‌ ఈగ్రంథా న్ని పరిష్కరించి 113 మంది కవుల జీవిత సాహిత్య చిత్రణలతో ‘ఆంధ్ర రచయితలు’ బృహత్సంపుటిని సాహితీ ప్రపంచంముందు ఉంచారు.

ఇందులో ఎంతోమంది రచయితలు నేటితరాలకి పరిచయంలేనివారే. అటువంటి రచయితలు విస్మరులు కారని, తెలుగువారికి నిత్యసంస్మరణీయులని ఈ సంపుటిద్వారా మధునా పంతుల నిరూపించారు.
తెలుగులో బృహత్‌ నిఘంటువు ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు’ రూపకల్ప నలో మధునాపంతుల పాత్ర కీలకమైనది. 1942లో షడ్దర్శన సంగ్రహాన్ని, 1943లో ‘రత్నపంచాలిక’, ‘సూర్య సప్తతి’ ఇలా 1986 వరకూ మధునాపంతుల వారు ఎన్నో రచనలు చేశారు. వాటిలో ఆయనను ఉత్తమోత్తమ కవుల శ్రేణిలో నిలిపిన ‘ఆంధ్రపురాణం’ను 1954లో ప్రకటించారు. దీనికి కవిసామ్రాట్‌ విశ్వ నాధ సత్యనారాయణ విపుల పీఠిక రాశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ఈకావ్యం సాహితీ విమర్శకులనుంచి ప్రశంసలందు కుంది.

తొమ్మిది పర్వాలతో అలరారే ఈ చారిత్రక కావ్యం ఆధునికాంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈయన తొలి ఖండకావ్యం ‘తోరణము’. ఇది 1938లో వెలువడింది. మధునాపంతుల వారి మిగిలిన రచనల్లో ధన్వంతరి చరిత్ర,రత్నావళి నాటకము, బోధి వృక్షము నవల. చరిత్ర ధన్యులు, కళ్యాణ తార, స్వప్న వాసవదత్త, శ్రీఖండము, తెలుగులో రామాయణాలు, చైత్రరథ ము, సదాశివ పంచాంశిక, సాహిత్యవ్యాసాలు, కేళాకుళి, కథా పుష్కరిణి- నాలుగు భాగాలు, ప్రసంగ తరంగిణి వంటి అక్షర సంపద చాలా వరకూ అలభ్యం. వీటిని పునర్ముద్రించవలసి ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు మధునాపంతుల వారి సంపాదకత్వంలో చాలా పుస్తకాలను వెలువరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనని ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించుకుంది. ఢిల్లీలో ఆలిండియా రేడియో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి కవి సమ్మే ళనంలో ఆయన తెలుగువారిపక్షాన వినిపించిన కవిత ఎందరి ప్రశంసలనో అందుకుంది. ఆనాటి ప్రపం చ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతులు మీదుగా 1975లో సన్మానాన్ని అందుకున్నారు. సర్వారాయ సాహితీ పురస్కారం, మహాంధ్ర జన పక్షాన రాజమండ్రిలో సన్మానం, ఆంధ్ర పురాణ రజతోత్సవం, అభిజనాభినందన ఇలా ఎన్నో సన్మానాలు, సత్కారాలు ఆయన జీవిత పర్యంతం అందుకున్నారు.

j.v-ratnakar11998లో హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై నన్నయ విగ్రహాన్ని ఆవిష్కరించింది మధునాపంతుల వారే. అదే యేడాది రాజమండ్రి లలితా నగర్‌లో ఆయన నివాసగృహం ఉన్న వీధికి పురపాలకసంఘం ఆయన పేరుపెట్టి గౌరవించుకుంది.1947లో వీరేశలింగ ఆస్తిక ఉన్నత పాఠశాలలో ఆంధ్రపండిత పదవిలో చేరిన మధునాపంతుల 1974 వరకూ అదే పాఠశాలలో పనిచేశారు. 1992 నవంబర్‌ 7న కాలధర్మం చెందారు.

18, ఫిబ్రవరి 2013, సోమవారం

ప్రేమ్‌చంద్ పై పుస్తకం



సారంలోనూ ప్రేమ్‌చందే! -

"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు, బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్చుకుంటున్న తల్లే ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. దీంతో తన దగ్గరున్న డబ్బులతో ఒక పళ్ళకర్ర కొని ఇంటికి తీసుకెళతాడు.'' ప్రచురణ సంస్థ గానీ ఫలానా రచనని గానీ అంతగా గుర్తులేని ప్రేమ్‌చంద్ కథ ఇది.

ఈ కథలో పిల్లాడిలాగే, జీవితమంతా చాలా బాధ్యతగా, ఇతరుల అవసరాలు తీర్చడంలోనే తన సంతృప్తిని వెతుక్కున్నాడు ప్రేమ్‌చంద్. ఆయన సహచరి శివరాణీదేవి రాసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్' (అనువాదం : ఆర్. శాంతసుందరి) చదివితే ఈ విషయం తెలుస్తుంది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని తీర్చడమే కాదు, వారి కళా, రాజకీయ వ్యక్తిత్వాలు వికసించే చారిత్రక, సామాజిక ఉద్యమ సందర్భాన్ని కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి ప్రేమకు ముఖం వాచిపోయిన ప్రేమ్‌చంద్... ప్రతి స్త్రీ నుంచి ఆ లోటు తీర్చుకునేందుకు ఆరాటపడ్డాడు.

భార్యాభర్తల మధ్య గాఢంగా అల్లుకోవాల్సిన ప్రజాస్వామిక సంబంధాలను ఈ క్రమంలోనే ఆయన గుర్తించి గౌరవించాడనేందుకు శివరాణీదేవి-ప్రేమ్‌చంద్‌ల సంభాషణలే రుజువు. ఈ సంభాషణ తరచూ పాత వాసనలు వేయడం, సంప్రదాయ, దైవిక శక్తుల ప్రస్తావనతోనే ప్రేమ్‌చంద్ సైతం తన వాదనను నెగ్గించుకోవడం చూస్తాం. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న రైతాంగంతో ఉండి రచనలు చేసినవాడు కాబట్టి, చివరి వరకు ప్రేమ్‌చంద్‌లో సంప్రదాయ భావనలు నిలిచే ఉన్నాయి. దీన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన పరిశీలన... జాతీయోద్యమం, సోవియట్ విజయాలతో రెక్కవిప్పిన అభ్యుదయ ఉద్యమం సైతం అప్పటికి పూర్తిగా కుబుసం విడవలేదనేది. ఈ అభ్యుదయ ఉద్యమానికి కళా, సాహిత్య రంగాల్లో సారథ్యం వహించినవాడు ప్రేమ్‌చంద్ అనేది ఇక్కడ గమనార్హం. ప్రేమ్‌చంద్ స్మరణకే పూర్తిగా ఈ పుస్తకం అంకితం కాకపోవడం మరో విశేషం.

జాతీయోద్యమంతో మమేకమైన బలమైన రాజకీయ వ్యక్తిత్వం గల ఆధునిక యువతిని శివరాణీదేవిలో మనం చూస్తాం. ఇండియన్ గోర్కీగా పిలవబడే ప్రేమ్‌చంద్ చివరి రచన, చివరి స్మారక ఉపన్యాసం (1936) కూడా గోర్కీపైనే కావడం, మాగ్జిమ్ గోర్కీ మరణించిన రెండు నెలల్లోపే ఆయనా మరణించడం గుర్తుండిపోయే విషయాలు. అయితే ప్రేమ్‌చంద్ జీవన, రచనా సారాన్ని పట్టుకోలేకపోవడం, ఆయన ఉర్దూలో మానేసి హిందీ భాషలో రచనలు చేయడమనే ఒక గుణాత్మక పరిణామానికి ప్రేరణగా నిలిచినదేమిటనేది తెలియజెప్పకపోవడం ఈ పుస్తకం పరిమితే.

- వి. అరవింద్

ఇంట్లో ప్రేమ్‌చంద్ - శివరాణీదేవిఅనువాదం : ఆర్. శాంతసుందరిపేజీలు : 274, వెల : రూ. 120ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

21, జనవరి 2013, సోమవారం

శతాబ్ది వెన్నెల

శతాబ్ది వెన్నెల – డా.కె.గీత


Satabadi Vennela Cover

ఉరుకులు, పరుగులతో నిండిన రోజులలో, ఒక్కసారి ఆగి, జీవితంలో వెనక్కు చూస్తే ఆ జ్ఞాపకాల ఊసులు మధురంగా ఉంటాయి కదా. అట్లాంటి అనుభూతిని, స్వాంతనను ఇచ్చే కవిత్వమే ఈ”శతాబ్ది వెన్నెల” పుస్తకం.
భారతదేశం, హైదరాబాదు నుంచి 13,600 కిలో మీటర్ల దూరం లో, అమెరికాలో, కాలిఫోర్నియాలోని, మౌంటైన్ వ్యూ లో ఉంటున్నా, 0 కిలో మీటర్ మైలు రాయి దగ్గరే ఉంటుంది రచయిత్రి మనస్సు. “జ్ఞాపకాల వలస పక్షులు” కవితలో అక్కడ జీవిస్తున్నా, ఇక్కడి జ్ఞాపకాలు ఎలా ముసురుకుంటాయో వివరిస్తారు.

కళ్ళు నులుము కుంటూ నిద్రలేచానా
పేము బెత్తంతో నాన్న తయారు
యోగర్టు కప్పు మూత తెరిచానా
మీగడ పాల వెన్న బువ్వ గోరుముద్దల అమ్మ ముఖం
జాంకాయ కాకెంగిలికున్న రుచి స్టాబెర్రీకుంటుందా!
బఠానీలతో బరువెక్కిన లాగు జేబు, జీన్స్ పాంటుకుంటుందా!”

ప్రేమించి, మమైకమయ్యాక, నువ్వు నాకొద్దు అంటే, మనసు ఎలా చిన్నపోతుంది! హైదరాబాదులో స్థిరపడిన కోస్తాంధ్ర ప్రజలను సంక్రాంతి సెలవుల తరువాత తెలంగాణాకు రాకుండా సరిహద్దు గోడ కడతామని అంటే మనసు విలవిలలాడదా!
“సరిహద్దు ప్రేమ” కవితలో
“అతడు నన్ను ఏనాడు అడగలేదు
ఎక్కణ్ణించి వచ్చావని?
అతడి సంస్కృతి వంటపట్టించుకున్నాను
ఒకరోజు ఏమైందో నాకే తెలియదు
హఠాత్తుగా వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టాడు
నా ప్రాంతంలో నీ ఉనికి ఉండగూడదన్నాడు
నా ప్రాంతం – అతని ప్రాంతం
నేనెందుకు అతన్ని వదలి వెళ్ళాలో
నా ప్రేమంతా ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదు”

దేశాలు మారినా, కాలాలు మారినా మనుషుల మనస్తత్వం ఒక్కటే. ఎక్కడివారైనా మనుషులు మారరని షేక్‌స్పియర్ తన పాత్రల ద్వారా చెప్పాడు. అమెరికా లో కూడా మన చర్మపు రంగు మనమెవరో చెప్తుంది. అమెరికా లో జాతి వివక్షత నివురుగప్పిన నిప్పులా కనపడదు కాని……… కవయిత్రి గీత ఈ విషయమై తన అభిప్రాయం వెళ్ళడిస్తూ “Identity” అనే కవితలో అంటారు

“నిన్ను చూడగానే గుర్తించే రంగు
నీ ముఖాకృతి – నీ ఐడెంటిటి
నువ్వు అమెరికన్ ఇండియన్ వా
ఏషియన్ ఇండియన్ వా
……………………………………………
నీ శరీరం పైన వొలిస్తే లొపలేం ఉంది?
………………………………………………………
నీ భాషని కూడా ఈసడించే చూపు
నువ్వు ఇంగ్లిష్ మాట్లాడితే ఆఫీసరూ
స్పానిష్ మాట్లాడితే నౌకరూ ఎలా అయ్యేవసలు?”

“Optimism is life while pessimism is death” అని సంజీవదేవ్ ఒక చోట వ్రాస్తారు. గీత నిస్సందేహంగా గొప్ప ఆశావాది. మృత్యువులో కూడా జీవితాన్ని చూస్తుంది. రాలే ఉల్క ఏ అశుభానికి సూచనమో అని పెక్కుమంది తల్లడిల్లితే తను మటుకు “కిటికీ లేని గది”అనే కవితలో
“రోజూ కిటికీ వైపు చూస్తూనే ఉన్నాను
రాలిపడే నక్షత్రపు అదృష్టం కాస్తయినా తలకు రుద్దుకుందామని”

డా.గీత మనుషులను, మనస్సులను, అకాశాన్ని, నక్షత్రాలను మాత్రమే కాదు వన్యప్రాణులనూ తన కవితలలో స్పృసించకుండా వదలలేదు. కజిరంగా అభయారణ్యం (అస్సాం) గురించి వ్రాస్తూ-

“ఏనుగంత గడ్డిలో ఏనుగెక్కి సవారి
ఈ అకాశానికెన్ని జింకల అడుగుజాడలు !
ఎన్నెన్ని తెల్ల కొంగల మబ్బు మరకలు !!
ఖడ్గమృగాలు నిర్భయంగా కొమ్ము తలెత్తే సువిశాల మైదానం
గగనానికెక్కుపెట్టిన గడ్డిబాణాలు
ఏనుగుపాదం మునిగే నునుపైన బురద నేలలు”

జన్మ దినాన్ని అబ్దుల్ కలాం గారు ఇలా నిర్వచించారు – “నువ్వు రోదిస్తున్నప్పుడు, నీ తల్లి ప్రమోద భరితమయిన ఏకైక దినమే, నీ జన్మదినం”. గీత తన పుట్టిన రోజు అనుభూతులను “హేపీ బర్త్‌డే” అనే కవితలో వ్రాస్తారు
“సంవత్సరంలో ఏదో వింతజరిగిపోయినట్లు
భూమ్మీద మరెవరూ ఎప్పుడూ జన్మించనట్లు
ఒక కొత్త ఆనందం “

పిల్లలయితే ఎప్పుడు పెద్దవారమవుతామా అనే తొందరలో కొత్త జన్మదినాల్ని సాదరంగా ఆహ్వానిస్తే, పెద్దవారు ఇంకో సంవత్సరం పెద్దవారమయ్యామా అని ఖేద పడటమూ కద్దు. గీత మాటలలో
“ఇంకా ఎన్ని పుట్టిన రోజులు?!
అయ్యో! వయసొచ్చేస్తుంది!!
అసలింకా బర్త్‌డేలు చేసుకుంటారా?!
అంతా నాకు శుభాకాంక్షలు చెప్పేస్తే బావుణ్ణు”

ఇంకా ఎన్నో వైవిధ్యమయిన, డయాస్పరా గీతాలు, కవితలతో నిండినదీ కవితల పుస్తకం. సరిహద్దు ప్రేమ లాంటి కవితలు చదివిన చాన్నాళ్ళ తరువాత కూడా వెంటాడుతాయి. డా.గీత జ్ఞాపకాల ఊసుల సమారోహమే ఈ శతాబ్ది వెన్నెల. ఈ పుస్తకం అట్టపై చిత్రాన్ని డా|| గీత కూతురైన వరు గీస్తే, ముఖపత్ర రూపచిత్రణ కొడుకు కోమల్ చేయటం ముదాహవం. కవితలను ఆస్వాదించేవారిని అలరించగలదీ చిన్న పుస్తకం.
---------------------------------------
1/8 డెమి: పుటలు 108
ధర: రూ129/-
సత్య ప్రచురణలు, హైదరాబాదు.
లభ్యత: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, దిశ పుస్తక దుకాణాల్లో.
Blog: http://kalageeta.wordpress.com/

పంచతంత్రం (నవల)



పంచతంత్రం (నవల) 
 రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''


పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

నిజాం పాలనలో లంబాడాలు

నిజాం పాలనలో లంబాడాలు
(Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams)
- భంగ్యా భుక్యా



ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.


ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.


దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.


చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి. ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.


ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.


దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.


- భంగ్యా భుక్యా

(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:


''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''

..............................
...............................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''

..............................
..............................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''

..............................
...................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:


భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌ సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.



నిజాం పాలనలో లంబాడాలు

- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010

తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-


ప్రతులకు వివరాలకు:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849

ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com
నిజాం పాలనలో లంబాడాలు
 (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) 
- భంగ్యా భుక్యా


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా
 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా

ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com